త్రీడి హర్రర్ చిత్రంలో అంజలి !

త్రీడి హర్రర్ చిత్రంలో అంజలి !

Published on May 21, 2018 12:27 PM IST

ఇప్పటి వరకు దక్షిణాదిన చాలా మంది దర్శకులు చాలా హర్రర్ సినిమాల్ని తెరకెక్కించారు. వీటిలో కొన్ని భిన్నమైనవి కాగా చాలా సినిమాలు ఒకే ఫార్మాట్లోనే రూపొందినవి. దీంతో ప్రేక్షకులకు హర్రర్ సినిమాల పట్ల నమ్మకం కొద్దిగా సన్నిగిల్లిందనే చెప్పాలి. ఈ నైపథ్యంలో కొత్త ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతినిచ్చేలా ఒక హర్రర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాజు విశ్వనాథ్.

ఇందులో ప్రముఖ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్రీడి టెక్నాలజీతో తెరకెక్కించనున్నారు. దీనికి ‘లిసా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విక్రమ్ కుమార్ యొక్క ’24’తో పాటు పలు తెలుగు చిత్రాలకు రచనా విభాగంలో పనిచేసిన రాజు విశ్వనాథ్ రెండు భాషల్లో చిత్రాన్ని రూపొందించాలని అనుకున్నాం, అందుకే రెండు భాషలు సులువుగా మాట్లాడగల నటి అయితే బాగుంటుందని అంజలిని తీసుకున్నాం అన్నారు.

త్వరలోనే మొదలుకానున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అంజలి గతంలో ‘గీతాంజలి, చిత్రాంగథ’ వంటి హర్రర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు