‘బాహుబలి’ సౌండ్ మిక్సింగ్ పూర్తి..!

‘బాహుబలి’ సౌండ్ మిక్సింగ్ పూర్తి..!

Published on Jul 4, 2015 8:31 PM IST

BAAHUBALI
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు ఇది కీలకమైన సమయంగా చెప్పుకోవచ్చు. మరో వారం రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చింది. ఓ పక్క ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేస్తూనే దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను భారీ ఎత్తున చేపట్టారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టేయగా, రాజమౌళి గత రెండు రోజుల నుంచి నేరుగా తానే ప్రచారంలోకి దిగారు.

ఈ ఉదయం బాహుబలి సౌండ్ మిక్సింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయ్! రాజమౌళి గత చిత్రాల్లానే ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. నేటితో కీరవాణి తన పాత్రను పూర్తి చేశారు. ఇక హైద్రాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఆధ్వర్యంలో డీఐ పనులు జరుగుతున్నాయి. త్వరత్వరగా ఈ పనులన్నింటినీ పూర్తి చేసి రిలీజ్ డేట్‌కి కొన్ని రోజుల ముందే సినిమాను పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. జూలై 10న తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు