దర్శకరత్న దాసరి నారాయణరావుగారు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంవత్సరం జనవరి 19న తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కిమ్స్ వైద్యులు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్న అయన నెమ్మదిగా కోలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు.
ఈ నెలలో కూడా ఆయనకు మరోసారి శస్త్ర చికిత్స జరిగింది. అలా మెల్లగా కోలుకుంటున్న ఆయనకు ఉన్నట్టుండి ఇన్ఫెక్షన్ ఎక్కువైందని, అందుకే మరోసారి సమస్య తలెత్తిందని తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన కిమ్స్ వైద్యులు దాసరి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఈ నెలలోనే 75వ పుట్టినరోజును జరుపుకున్న దాసరిగారు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకుందాం.