మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ ఎప్పుడెప్పుడు థియేటర్ల ముందుకు వచ్చేస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న విషయం తెలిసిందే. టీజర్ విడుదలైనప్పట్నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్ళిపోయింది. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైలిష్ పోలీసాఫీసర్ లుక్ అదిరిపోయేలా ఉండడంతో యూట్యూబ్లో ఈట్రైలర్ సందడి సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్కు 3 మిలియన్ మేర వ్యూస్ రావడం విశేషంగా చెప్పుకోవాలి.
ఇక ఆడియో, ట్రైలర్లను పెద్ద ఈవెంట్ ఏదీ లేకుండా విడుదల చేసిన టీమ్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ను మాత్రం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 4న ఈ ఫంక్షన్ ఉంటుందని ఇంతకుముందే తెలియజేయగా, తాజాగా హైద్రాబాద్లోనే ఈ ఫంక్షన్ ఉంటుందని టీమ్ స్పష్టం చేసింది. మొదట వైజాగ్, తిరుపతి లాంటి నగరాల పేర్లు వినిపించినా, చివరికి హైద్రాబాద్నే ఫిక్స్ చేశారట. ఇక హైద్రాబాద్లో ఈ ఫంక్షన్కు వేదిక ఏదన్నది మరో రెండు రోజుల్లో తెలియనుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మించారు.