మత్తుమందుల వాడకం, వ్యాపారం తెలుగు పరిశ్రమను కుదిపేస్తోంది. గత రెండు మూడు రోజులుగా ఇండస్త్రీలో, మీడియాలో నానుతున్న ఈ అంశం కొంచెం కొంచెం బహిర్గతమవుతూ ఉంది. ఇప్పటికే ఎక్సయిజ్ శాఖ దర్యాప్తు జరిపి డ్రగ్స్ వాడుతున్న వారికి, వాటితో వ్యాపారం చేస్తున్న వారికి పేర్లను గోప్యంగా ఉంచి నోటీసులు పంపగా తాజాగా మీడియాలో కొందరు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, ఇతర నటులు, సాంకేతిక నిపుణల పేర్లు బయటికొచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి.
సదరు వ్యక్తులు మాత్రం డ్రగ్స్ వ్యవహారాంతో తమకెలాంటి సంబంధంలేదని అంటున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం పేర్లను బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని, తామెవరి వివరాలను బయటకు వదల్లేదని చెప్పుకొచ్చారు. అలాగే వీటితో సంబంధమున్న పరిశ్రమలోని కొందరి పెద్దల పేర్లు మాత్రం బయటకురాలేదని, వారి పలుకుబడి వలనే పోలీసులు వారి జోలికి వెళ్లడంలేదనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.