తెలుగులో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తనదైన కామెడీ టచ్ ఉన్న డైలాగులతో, కామిక్ టైమింగ్తో టాప్ కమెడియన్స్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ‘గీతాంజలి’ అనే సినిమాలో ఒక పూర్తి స్థాయి హీరో తరహా పాత్రలో నటించిన శ్రీనివాస్, తాజాగా హీరోగా నటించిన మరో సినిమా ‘జయమ్ము నిశ్చయమ్మురా’. శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే టీజర్తో అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఇక ఈ టీజర్కు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్లే బిజినెస్ కూడా ఇప్పటికే జరిగిపోవడం విశేషంగా చెప్పుకోవాలి. తమిళ స్టార్ హీరో విక్రమ్ గత చిత్రం ఇంకొక్కడును తెలుగులో విడుదల చేసిన నిర్మాత నీలం కృష్ణా రెడ్డి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ మొత్తాన్నీ సుమారు 7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి హీరోగా చేసిన సినిమాకు విడుదలకు ముందే ఈ స్థాయి బిజినెస్ జరగడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి సరసన పూర్ణ హీరోయిన్గా నటించారు.