ఇంటర్వ్యూ : రామ్మోహన్‌ – ‘తను నేను’కి తండ్రీ-కూతుళ్ళ సంఘర్షనే హైలైట్!

ఇంటర్వ్యూ : రామ్మోహన్‌ – ‘తను నేను’కి తండ్రీ-కూతుళ్ళ సంఘర్షనే హైలైట్!

Published on Nov 24, 2015 8:08 PM IST

Rammohan
అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూప‌ర్‌ హిట్‌ మూవీస్‌ని నిర్మించారు రామ్మోహన్‌.పి. ఆయ‌న ద‌ర్శ‌కుడిగా మారి.. అవికా గోర్‌ హీరోయిన్‌గా, ‘వర్షం’ దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో నిర్మించిన‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘తను నేను’ ఈనెల 27న రిలీజ‌వుతోంది.

టాలీవుడ్‌ అగ్రనిర్మాత డి.సురేష్‌బాబు స్నేహం, మూవీ మొఘల్‌ డా.డి.రామానాయుడు మార్గదర్శనంలో ఫిలింమేకింగ్‌లో రాటుదేలిన ఆయన స్టూడియో పాఠాల్ని నేర్చుకున్నాకే సినిమా మేకింగ్‌లో ప్రవేశించి సన్‌షైన్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మిస్తూ విజయాలు అందుకుంటున్నానని చెప్పారు. ఈనెల 27న `త‌ను – నేను` రిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలివి..

* నేను డెస్టినీని నమ్ముతాను. నిజానికి సినిమాల్లోకి రాకముందు నాకు వేరొక బిజినెస్‌ ఉండేది. అప్పటికి సినిమాలపై అవగాహనే లేదు. కానీ నిర్మాత డి.సురేష్‌బాబుతో స్నేహం వల్ల అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చాను. స్టూడియో వాతావరణం అంటే ఏమిటో తెలిసింది. సినిమా అంటే ఏంటో ఎబిసిడి పాఠంలా నేర్పించారు సురేష్‌బాబు. విలువలతో కూడిన సినిమా ఎలా నిర్మించాలి? మంచి కథను ఎలా ఎంచుకోవాలి? అన్నది నాయుడుగారు నేర్పించారు. నేను పరిశ్రమలోకి వచ్చి సినిమా నిర్మించాలి అనుకున్నప్పుడు 2002లో మొదటగా సురేష్‌ ప్రొడక్షన్‌లో ఇంద్రగంటి మోహన్‌ కృష్ణను కలిశాను. ఆయనతో కలిసి చర్చించేప్పుడే గోల్కొండ హైస్కూల్‌ నవల కొన్నాం. ఆ టైమ్‌లోనే విరించి వర్మ కలిసి ఉయ్యాల జంపాల కథ చెప్పారు. క‌థ‌ల్ని పూర్తిగా రెడీ చేసుకున్నాం. అలాగే రామానాయుడు ఫిలింస్కూల్‌ స్టూడెంట్‌ సాయేష్‌ ‘తను-నేను’ కథని అమ్ముకుని, వేరే జాబ్‌ అవకాశం రావడంతో అమెరికా వెళ్లిపోయాడు. ఆ కథనే ఇప్పుడు నేను డైరెక్ట్‌ చేశాను.

* నిజానికి నేను డైరెక్టర్‌ అనుకోగానే అందరూ సపోర్ట్‌ చేశారు. ముందుగా హీరో రానా ప్రొసీడ్‌ అంటూ ఎంకరేజ్‌ చేశాడు. నా శ్రేయోభిలాషులు, టెక్నీషియన్స్‌ అందరూ నన్ను ప్రోత్సహించారు. ఎలాగూ డెస్టినీ నడిపిస్తుంది. ప్రొడక్షన్‌లోకి అనుకోకుండానే వచ్చాను. ఇప్పుడు కూడా ముందుకెళ్లాలని అనుకున్నా. ఆ క్రమంలోనే ‘గోల్కొండ హైస్కూల్‌’ సినిమాకి పనిచేసిన సంతోష్‌ కనిపించాడు. తను ఆఫీస్‌కి వచ్చినప్పుడు రిహార్సల్స్‌ చెయ్‌.. హీరో క్యారెక్టర్‌ నువ్వే చేయాలి అంటూ చెప్పాను. ఆ త‌ర్వాత సురేష్‌బాబుగారి ఎంకరేజ్‌మెంట్‌తో తను-నేను సినిమా పూర్తి చేశాను.

* 20 ఏళ్ల పాటు స్టూడియోలో పనిచేసిన అనుభవం ఉంది. అందువల్ల దర్శకుడిగా నా పని సులువైంది. నిర్మాతగా నా అనుభవం ఇప్పుడు చాలా ఉపయోగపడింది. అన్ని శాఖలతోనూ పరిచయం ఉంది కాబట్టి అది పెద్ద హెల్ప్‌ అయ్యింది. పైగా టీమ్‌ అందరం ఓ ఫ్యామిలీలా కలిసి పనిచేయడం వల్ల కొత్త అనిపించలేదు. ఓ మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉందిప్పుడు.

* అయితే సెట్‌లో నటుడు రవిబాబు విషయంలో కొంత టెన్షన్‌ పడ్డా. ఆయన ఓ దర్శకుడు, తనని డైరెక్ట్‌ చేయాలంటే ఎలా అనుకున్నా. కానీ అతడి సపోర్ట్‌ తో పని సులువైంది. మొదటిసారి దర్శకుడికి ఎలాంటి సలహాలు కావాలో అవి ఇచ్చారాయన.

* మేం నిర్మించిన సినిమాల్లో కథా వైవిధ్యం, నాని ‘భలే భలే మగాడివోయ్‌’ తరహాలోనే కథ పరంగా వైవిధ్యం ‘తను-నేను’లో ఉంటుంది. నా కూతురు అమెరికా వెళ్లాలి అనే తండ్రికి, అసలు అమెరికా వెళ్లడం ఇష్టం లేని కూతురికి మధ్య కాన్‌ఫ్లిక్ట్‌ ఫ్రెష్‌గా అనిపించింది. రెండేళ్ల క్రితమే ఈ కథ విన్నప్పుడు కొత్తగా ఉందే అని కన్విన్స్‌ అయ్యాను. అలాగే నును ఇంజినీరింగ్‌ అయ్యాక అమెరికా వెళ్లాలనుకున్నా. నాతోటి వాళ్లంతా అమెరికా వెళ్లగలిగినా నేను వెళ్లలేకపోయా. అందుకే ఈ పాయింట్ కూడా కనెక్టయ్యింది.

* ‘గోల్కొండ హైస్కూల్‌’ మూవీలో గౌతమ్‌ అనే క్యారెక్టర్‌లో నటించాడు సంతోష్‌. అతడు ఆడిషన్‌లో బాగా నచ్చాడు. తను హీరో అవుదామని అనుకున్నా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొంత‌కాలం బెంగళూరు వెళ్లిపోయాడు. అక్కడ థియేటర్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాడు. అది కూడా తనకి హీరోగా ప్లస్‌ అయ్యింది. చక్కని రొమాన్స్‌, హ్యూమర్‌తో ఉండే ఈ సినిమాలో తను బాగా ఒదిగిపోయి నటించాడు. ఈ చిత్రంలో హీరో సంతోష్‌ నటన, యాక్సెంట్‌ ఆకట్టుకుంటాయి. అవికాగోర్‌ నటిగా నిరూపించుకుంది కాబట్టి చాలా పెద్ద ప్లస్‌ అవుతుంది.

* ప్రొడక్షన్‌ బాగానే చేస్తున్నారు. దర్శకత్వం ఎందుకు? అని అందరూ అడుగుతారు. అందుకే ఎవరితోనూ చెప్పకుండానే సినిమా ప్రారంభించాను. అయినా కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమా చేశాను. ముందుగా నటీనటులతో 2 నెలల పాటు రిహార్సల్స్‌ బాగా చేయించాను. అందువల్ల కొత్త దర్శకుడైనా లొకేషన్‌కి వెళ్లాక ఇబ్బంది పడకుండా కేవలం 33 రోజుల్లో సినిమా పూర్తి చేయగలిగాను.

* ప్రస్తుతం ‘పిట్టగోడ’ అనే ఓ చిన్న సినిమా నిర్మిస్తున్నా. అనుదీప్‌ అనే కొత్త కుర్రాడు దర్శకత్వం వహించనున్నాడు. విశ్వదేవ్‌ రాచకొండ – పునర్నవి జంటగా నటిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతోంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నా మాతృసంస్థ. అందుకే ఇక్కడే సినిమాలు తీస్తాను. ఒకవేళ దర్శకుడిగా, లేదా నిర్మాతగా ఎలా అయినా ఈ సంస్థతో నా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు