దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఇజం’ పేరుతో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్టైనర్ కొద్దికాలంగా ఎక్కడిలేని క్రేజ్ సంపాదించుకుంది. కళ్యాణ్ రామ్ మునుపెన్నడూ కనిపించనంత సరికొత్త లుక్లో కనిపించడం, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం పూరీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు. ఇక మొదట దసరాకే విడుదలవుతుందనుకున్న సినిమా, దసరా రేసు నుంచి తప్పుకొని అక్టోబర్ మూడో వారానికి వాయిదా పడింది.
కాగా సరైన విడుదల తేదీ మాత్రం ప్రకటించకపోవడంతో ఇజం అక్టోబర్ 20న వస్తుందని, 21న వస్తుందని చాలా ప్రచారాలు వినిపించాయి. తాజాగా ఈ ప్రచారాలకు తెరదించుతూ టీమ్ కొద్దిసేపటి క్రితమే విడుదల తేదీని ప్రకటించేసింది. అక్టోబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ టీమ్ తెలిపింది. పూరీ స్టైల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయిన ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్గా నటించారు. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో ఈమధ్యే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది.