నేడే ‘మా’ ఎన్నికల పోలింగ్!

నేడే ‘మా’ ఎన్నికల పోలింగ్!

Published on Mar 29, 2015 9:57 AM IST

maa-election
గత కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలతో సినీ రాజకీయం వేడెక్కింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)‍లోని కీలక పదవులకు ఓటింగ్ ప్రారంభమైంది. 1993లో ప్రారంభమైన ఈ అసోసియేషన్‌కు ప్రస్తుతం ఎంపీ మురళీ మోహన్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మళ్ళీ ఆ పదవిని చేపట్టే ఆలోచనలో లేరు. ఇక ఈ క్రమంలోనే 2015-17 దఫాకు అధ్యక్ష పదవికి కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం మా అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, ప్రముఖ నటి జయసుధ పోటీ పడుతున్నారు. ఈ ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు సాగనుంది. మొత్తం సుమారు 750మంది శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. అందులో 708మంది ఓటు హక్కు కలిగిన వారున్నారు. ఇక ఇప్పటికే ఉపాధ్యక్ష పదవులకు శివకృష్ణ, మంచు లక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. పోటీలో ఉన్న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడం ఈ ఎన్నిక పట్ల సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తి రేగింది. కాగా, మా ఎన్నికలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్‌కు గానూ, కోర్టు స్పందించి ఎన్నికలు జరిపినా కోర్టు ఆదేశాలు జారీ అయ్యాకే ఫలితాలు ప్రకటించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు పోలింగ్ జరిగినా కోర్టు ఉత్తర్వుల మేరకు ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యే అవకాశం లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు