సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలని పూర్తిచేసుకుని రేపు విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగా తాజాగా ఈరోజు ఉదయం ఇంకొక ట్రైలర్ ను విడుదలచేశారు. ఈ ట్రైలర్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
ఇందులో మహేష్ ప్రకృతి పాత్రకి వాయిస్ ఓవర్ ఇస్తూ అసలు ప్రకృతి అంటే ఏంటో వివరిస్తూ నేను నీకు హెల్ప్ చేస్తాను.. నువ్వు చేయాల్సిందల్లా నన్ను ఫీలవ్వడమే అంటూ చెప్పిన డైలాగ్స్ వాస్తవిక భావనతో నిండి ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి ఇంకాస్త పెరిగింది. మరి మనిషి ప్రకృతితో ఎలా మమేకమవ్వాలో చెప్పేదిగా ఉంటుందని మంజుల చెబుతున్న ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో మంజుల కుమార్తె కూడా ఒక కీలక పాత్రలో నటించడం విశేషం.