ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి ప్రకటించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన నంది అవార్డు మరోసారి మంచు లలక్ష్మి ప్రసన్నను వరించింది. గతంలోనే ఉత్తమ ప్రతినాయకురాలిగా ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాకు గాను నంది అందుకున్న మంచు లక్ష్మిని ఇప్పుడు మరోసారి నందిని అందుకోనుండటం విశేషం. ప్రవీణ్ సత్తారు రూపొందించిన ‘చందమామ కథలు’ సినిమాలోని నటనకు గాను, మంచు లక్ష్మిని ఉత్తమ సహాయనటి అవార్డుకు నంది అవార్డుల జ్యూరీ ఎంపిక చేసింది.
‘చందమామ కథలు’ సినిమాలో లీసా స్మిత్ పాత్రలో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్న మంచు లక్ష్మి ఆ పాత్రకు 100% న్యాయం చేశారని, తనకు ఈ అవార్డు రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. మంచు లక్ష్మి కూడా తెలుగు అమ్మాయిగా పుట్టడం తనకెంతో గర్వంగా ఉందని, తన నటనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలని అన్నారు.