సీనియర్ సంగీత దర్శకుడి వైపే చిరు చూపు

సీనియర్ సంగీత దర్శకుడి వైపే చిరు చూపు

Published on Nov 19, 2019 9:00 PM IST

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల చిత్రం త్వరలో సెట్స్ మీదికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి నుండి ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో సందిగ్ధత నడుస్తోంది. తన ప్రతి సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ చేత మ్యూజిక్ చేయించుకున్న కొరటాల ఈసారి మాత్రం సంగీత దర్శకుడిని మార్చారు.

మొదట బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్, అతుల్ ఈ చిత్రానికి మ్యూజిక్ చేస్తారని వార్తలు రాగా ఇప్పుడు మాత్రం తెలుగు వ్యక్తినే తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. మెలొడీ బ్రహ్మ మణిశర్మ. కొన్నాళ్ల క్రితం వరకు వెనుకబడిన ఆయన ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. మాస్ సినిమాలకు సంగీతం ఇవ్వడంలో మణిశర్మ పనితనం ఏమిటో అందరికీ తెలుసు.
అంతేకాదు చిరు కెరీర్లో భారీ విజయాలుగా నిలిచిన ‘ఇంద్ర, అన్నయ్య, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది’ లాంటి చిత్రాలకు అద్బుతమైన మ్యూజిక్ ఇచ్చిన ట్రాక్ రికార్డ్ ఉంది మణిశర్మకు.

అందుకే ఆయన్ను తీసుకోవాలని శివ, చిరులు భావిస్తున్నారట. అయితే ఈ విషయమై చిత్ర బృందం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు