దాసరి నారాయణరావు మృతి పట్ల సినీ లోకమంతా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులంతా దాసరి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు మాత్రం దాసరికి కడసారి వీడ్కోలు చెప్పడానికి హాజరుకాలేకపోయారు. ఉదయం దాసరిని సందర్శించేందుకు వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ దాసరి తమ కుటుంబానికి చాలా ఆప్తుడని, ఆయన మరణం తీవ్ర ఆవేదనను కలిగిస్తోందని అన్నారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి చైనా ప్రయాణంలో ఉన్నారని, మార్గ మధ్యలో ఉండటం వలన అటు వెళ్లలేక,ఇటు రాలేక తీవ్ర ఆవేదనకు గురయ్యారని, అయన మరణం అన్నయ్యను కలచివేసిందని చెప్పారు. ఇక రామ్ చరణ్ కూడా అందుబాటులో లేకపోవడం వలన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారని అన్నారు. ఇకపోతే మెగా హీరోలైన పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు ఈరోజు ఉదయం దాసరికి స్వగృహం వద్ద ఆయనకు సంతాపం తెలిపారు.