అటు తమిళ్, ఇటు తెలుగు చిత్రపరిశ్రమలో అంద చందాలతోనే కాదు అభినయంతో కూడా అలరిస్తూ ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో నయనతార ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ భాషలలో వైవిధ్యమైన పాత్రలు పోషించిన నయన తార అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ స్టార్స్ తో కలిసి నటించింది. అంతేకాకుండా తాజాగా దక్షినాదిన ఉన్న హీరోయిన్స్ లో ఏ హీరోయిన్ కి నెంబర్ వన్ గా నిలుస్తుందోనని ఓ సంస్థ ఓటింగ్ నిర్వహించగా అందులో నయన తారే అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ప్రస్తుతం తమిళ్ లో శింబు తో ’ఇదు నమ్మ ఆళు’, జీవాతో ’తిరునాళ్’ సినిమాల్ని రిలీజ్ కు రెడీ చేసిన నయనతార కార్తీ, విక్రమ్ ల సినిమాలతో పాటు తెలుగులో వెంకటేష్ సరసన ’బాబు బంగారం’ సినిమాలో కూడా చేస్తోంది. అయితే ఇంత బిజీగా ఉన్నప్పటికీ నయనతార మనస్సు ఇప్పుడు సినిమా నిర్మాణరంగం వైపు లాగుతున్నదని సమాచారం. దర్శకుడు విఘ్నేష్ శివన్ చెప్పిన కథ విన్న తరువాత ఆ సినిమాలో నటించడంతో పాటు తనే నిర్మిస్తానని చెప్పిందట నయనతార. మేలో షూటింగ్ స్టార్ట్ కాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.