అక్కినేని అఖిల్ను హీరోగా పరిచయం చేస్తూ, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నిన్నే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ఆఫ్రికాలో షూటింగ్ జరుపుకోనుంది. అఖిల్ సరసన సయేషా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను యువహీరో నితిన్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే!
ఇక ఈ సినిమా టైటిల్ విషయమై మొదట్నుంచీ రకరకాల ఊహాగానాలు వెలువడుతూ వస్తున్నాయి. అక్కినేని వంశంలో మూడో తరంలో పరిచయమవుతోన్న అఖిల్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పవర్ఫుల్ టైటిల్ కోసం సినిమా యూనిట్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే మిస్సైల్ అన్న పేరును దాదాపుగా కన్ఫర్మ్ చేశారని వినిపించింది. తాజాగా అఖిల్ సినిమా టైటిల్ మిస్సైల్ కాదని, సినిమా టైటిల్ విషయమై ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని అన్నీ కుదరగానే టైటిల్ అనౌన్స్ చేస్తానని నితిన్ తెలిపారు.