నిత్యామీనన్.. ఈ పేరు వింటే చాలు ఆమె అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. కళ్ళతోనే మాట్లాడగల నేర్పరి అయిన నిత్యా.. తన నటనతో ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. మణిరత్నం.. తన సినిమాల్లోని పాత్రలకు ఎంత గొప్ప ఐడెంటిటీని కల్పిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. సినిమా అయిపోయాక కూడా ఆ పాత్రలు మనతోపాటే కలిసి ప్రయాణం చేస్తాయంటే అతిశయోక్తి కాదు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ‘ఓకే బంగారం’. మనతో పాటే నడిచొచ్చే ఆ పాత్రే ‘తార’.
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’ నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమాకు అన్ని విధాలా చాలా మంచి స్పందన వస్తోంది. మణిరత్నం చాన్నాళ్ళకు తన రేంజ్ క్లాస్ సినిమా తీశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో దుల్కర్, నిత్యామీనన్ల జంట ఆద్యాంతం ప్రేక్షకుడిని కట్టిపడేసింది. తారగా నటించిన నిత్యామీనన్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది. ఈ సినిమాకు ఆమె నటన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఈ సినిమాతో నిత్యామీనన్ రేంజ్ చాలా పెరుగుతుందనడంలో సందేహం లేదు.
‘ఓకే బంగారం’ సినిమాయే కాక, నిత్యామీనన్ ఓ కీలక పాత్రలో కనిపించిన ‘కాంచన 2’ నిన్న తమిళంలో విడుదలైంది. ఈ సినిమాకూ మంచి స్పందన రాగా, నిత్యామీనన్ పాత్ర సినిమాకి గొప్ప ప్లస్ పాయింట్గా తెలుస్తోంది. ఈ సినిమా ‘గంగ’ పేరుతో తెలుగులో ఈ వారమే విడుదల కానుంది. ఇలా ఒకేరోజు తన రెండు సినిమాలతో, అదీ రెండూ ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పించిన నిత్యామీనన్ ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియా అయిపోయింది.