రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్, ఆడియోలను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. దీనికి నెలరోజుల ముందునుంచే మొదలుపెట్టిన పోస్టర్స్ రిలీజ్ ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఆడియో రిలీజ్ వేడుకను కూడా సూపర్ హిట్ చేసేందుకు సినిమా యూనిట్ సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఇక ఆడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రోజునుంచే ఆడియో రిలీజ్ ఎలా చేయబోతున్నారు? ప్రత్యేక అతిథులుగా ఎవరెవరు వస్తున్నారు? లాంటి ప్రశ్నలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ బాహుబలి టీమ్ సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున జరగనున్న ఈ వేడుకకు ప్రత్యేక అతిథులు ఎవ్వరూ లేరని బాహుబలి టీమ్ అనౌన్స్ చేసింది. బాహుబలి సినిమాకు పనిచేసిన నటులు, టెక్నీషియన్లతోనే ఈ వేడుకను వినూత్నంగా నిర్వహించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారట.
దర్శకుడు రాజమౌళికి ఆడియో రిలీజ్ను వినూత్నంగా, కొత్త పంథాలో నిర్వహించడం వెన్నతో పెట్టిన విద్య. ‘మగధీర’ సినిమా నుంచి ఈ తరహా ఆడియో రిలీజ్తో సినిమాపై క్రేజ్ను అమాంతం పెంచేసే టెక్నిక్ను వాడుకుంటూ వస్తున్నారు రాజమౌళి. ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమాకు కూడా అదే రేంజ్లో ఆడియో రిలీజ్ను నిర్వహించనున్నారట. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో, ఆ ఆడియో రిలీజ్ వేడుక ఏ స్థాయిలో అలరిస్తాయన్నది తెలియాలంటే మే 31వరకూ ఆగాల్సిందే!