సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్తో కలిసి ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా తర్వాత మహేష్ వెంటనే కొరటాల శివతో ఓ సినిమా, వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయనున్నారని కొద్దిరోజుల క్రితమే స్పష్టమయిపోయింది. తాజాగా వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమా గురించి నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి అప్డేట్ ఇచ్చారు.
మహేష్ పుట్టినరోజున తమ ప్రొడక్షన్ హౌస్ పీవీపీ సినిమా ద్వారా అనౌన్స్ అయిన మహేష్-వంశీ పైడిపల్లి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని, వచ్చే ఏడాది జూన్లో ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని అన్నారు. మహేష్ కోసం ఇప్పటికే మంచి కథను సిద్ధం చేసిన వంశీ, ప్రస్తుతం పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు. జూన్ కల్లా మురుగదాస్, కొరటాల శివల సినిమాలను పూర్తి చేసి మహేష్, వంశీ పైడిపల్లి సినిమాను మొదలుపెట్టనున్నారు.