తెలుగు సినీ పరిశ్రమలో త్రివిక్రమ్కు దర్శక, రచయితగా తిరుగులేని క్రేజ్ ఉంది. ఎంతో బలమైన భావోద్వేగాన్నైనా తన మాటలతో సునాయసంగా చెప్పగల సమర్థుడైన ఆయనకు, ఈతరం రచయితల్లో ది బెస్ట్ అన్న పేరుంది. ఇక అలాంటి త్రివిక్రమ్ తర్వాత తెలుగులో ఆ స్థాయి రచయితగా దర్శక రచయిత పరశురామ్ పేరు చెప్పుకోవచ్చని ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నారు. సున్నితమైన భావోద్వేగాలను తన డైలాగ్స్తో పరశురామ్ చాలా బాగా చెబుతారని ఆయన అన్నారు. ఈ ఉదయం హైద్రాబాద్లో జరిగిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సుకుమార్, పై వ్యాఖ్యలు చేశారు.
పరశురామ్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా మంచి వసూళ్ళు రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే నేడు సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దర్శకరత్న దాసరి, ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, సుకుమార్ ఈ మీట్కు ముఖ్య అతిథులుగా హాజరై సినిమాపై ప్రశంసలు కురిపించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించారు.