జయలలిత మరణం తర్వాత పలు మలుపులు తిరిగిన తమిళ రాజకీయాల్లో త్వరలో మరొక సంచలనం చోటు చేసుకోనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆ సంచలనం మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. కొద్దిరోజులు క్రితమే అభిమానుల సమావేశం ఏర్పాటు చేసి తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడిన రజనీ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అంతేగాక తాజాగా ఆయన వేసిన ఒక అడుగు అందరిలోను అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
రజనీ ఈరోజు కొన్ని రోజులుగా నదుల అనుసంధానం కోసం నిరసన చేస్తున్న 16 మంది రైతుల్ని కలిసి వారికి తన మద్దత్తు తెలపడమేకాక అనుసంధానానికి అయ్యే ఖర్చు కోసం కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు. అంతేగాక ఈ విషయంపై ప్రధానితో సంప్రదింపులు కూడా జరుపుతామని హామీ ఇచ్చారు. ఇలా రజనీ రైతుల సమస్యలపై స్పందించడం, ప్రధానితో చర్చలు జరుపుతామని అనడంతో తమిళనాట రాజకీయ వర్గాల్లో వేడెక్కువై రజనీ కొత్త పార్టీ పెడతారా లేకపోతే అధికార బీజేపీతో కలుస్తారా అనే మిలియన్ డాలర్ ప్రశ్న అందరిలోను ఉత్పన్నమవుతోంది.