తమిళనాడు రాష్ట్రానికి గత రెండు సంవత్సరాల నుండి డిసెంబర్ నెల అస్సలు కలిసి రాలేదు. చివరి సంవత్సరం ఇదే నెలలో భీకరమైన వరదలతో చెన్నై నగరం అతలాకుతలమై వందల మంది రోడ్డున పడితే ఈ సంవత్సరం తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత 5వ తేదీన మరణించారు. ఈ విషాదం జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే ప్రముఖ రంగస్థల హాస్య నటుడు, తుగ్లక్ వ్యంగ్య పత్రిక సంపాదకుడు అయిన చో రామస్వామి 7వ తేదీన కన్నుమూశారు.
ఈ వరుస విషాదాలతో తమిళ రాజకీయ, సినీ రంగాలు, ప్రజలు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అందరితో పాటే తీవ్రంగా బాధపడ్డ సూపర్ స్టార్ రాజనీకాంత్ తన అభిమానులను ఒక కోరిక కోరారు. అదేమంటే ఇంకో మూడు రోజుల్లో అనగా డిసెంబర్ 12న తన పుట్టినరోజును అభిమానులెవ్వరూ సెలబ్రేట్ చేయొద్దని, బ్యానర్లు, కటౌట్లు కట్టవద్దని, రాష్ట్రమంతా విషాదంలో ఉంటే వేడుక చేయడం భావ్యం కాదని కోరారు. దీంతో అభిమానులంతా కాస్త నిరుత్సాపడినా తలైవార్ మాటల్లోని అర్థాన్ని, ఆవేదనని గ్రహించి అందుకు అంగీకరిస్తున్నారు. చివరి సంవత్సరం కూడా వరదల కారణంగా రజనీ పుట్టినరోజును జరుపుకోలేదు.