అశేష ప్రేక్షకాదరణతో, అభిమానవుల అండదండలతో ఉన్నత స్థాయిని పొందిన మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఎప్పటికప్పుడు ఆ అభిమానవుల, ప్రేక్షకుల పట్ల తమ కృతజ్ఞతను త్తెలియజేస్తూనే ఉంది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పేరుతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ సాయం అంటూ తన దగ్గరికి వచ్చినవాళ్ళకి లేదనకుండా సహాయం చేస్తుంటారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ సేవా దృక్పధంలో చిరుని మించిపోయాడు. ఇప్పుడు వీరి బాటలోనే మరో మెగా హీరో, చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా నడుస్తున్నాడు.
ఎవరైనా తమ సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా స్వయంగా వారిని కలిసి వారి కష్టాలను, ఇబ్బందులను తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. చరణ్ తాజాగా పుట్టుకతోనే వినికిడి శక్తిలేని ఇద్దరు పిల్లలకి ఖర్చులన్నీ భరించి మెరుగైన వైద్యం చేయించి వారికి వినికిడి శక్తి వచ్చేలా చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ విషయాన్ని తెలుపుతూ చరణ్ ‘ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు మనలాగే మామూలుగా వినగలుగుతున్నారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు. చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. ఇకపోతే చరణ్ నటిస్తున్న ‘ధృవ’ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది.