‘పండగ చేస్కో’ హిట్ తర్వాత జోరు మీదున్న హీరో రామ్ ప్రస్తుతం రెండు వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. శివం, హరికథ టైటిల్స్తో రూపొందుతోన్న ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాలన్న సంకల్పంతో రామ్, ఈ సినిమాలను పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. రామ్ సొంత బ్యానర్ అయిన స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘శివం’ ఇప్పటికే టాకీపార్ట్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పాటల షూటింగ్ జరుపుకుంటోంది.
నార్వే, స్వీడన్లలోని పలు అందమైన లొకేషన్లలో శివం పాటలను చిత్రీకరించేందుకు టీమ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గత వారం నార్వేలో అట్లాంటిక్ ఓషియన్ రోడ్స్పై ఓ పాటను చిత్రీకరించారు. ఈ పాట అవుట్పుట్తో సినిమా యూనిట్ చాలా హ్యాపీగా ఉందట. ఇక తాజాగా మరో అందమైన పాట కోసం యూనిట్ స్వీడన్కు షిఫ్ట్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ కలిపి ‘శివం’ సాంగ్స్ ఓ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తాయని రామ్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమాలో రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తున్నారు.