సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో వచ్చి ప్రభంజనం సృష్టించిన ‘రోబో’ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్పైనే చాలాకాలం శ్రమించిన టీమ్, కొద్దినెలల క్రితమే సినిమాను సెట్స్పైకి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది. ఈమధ్యే ఢిల్లీలో నెలరోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేసిన టీమ్, తాజాగా చెన్నైలో ఓ నెలరోజుల షెడ్యూల్ను మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది.
చెన్నైలో తారామణి ఫిల్మ్ సిటీలో జరిగే ఈ షెడ్యూల్ రేపట్నుంచి మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో విలన్గా నటిస్తోన్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ఈ షెడ్యూల్లో పదిరోజుల పాటు పాల్గొంటారు. జూన్ 3 వరకూ నిరంతరాయంగా ఈ షూటింగ్ జరగనుంది. ‘ఐ’ తర్వాత శంకర్ చేస్తోన్న సినిమా కావడం, శంకర్-రజనీల కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా అన్న ప్రచారం పొందడం, అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తోండడం.. ఇలా ఇన్ని ప్రత్యేకతలను నింపుకున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మిస్తోంది. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నారు.