దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈమధ్యే ఆడియో ఆవిష్కరణ వేడుకను కూడా జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై ఓ వార్త వినిపిస్తోంది. అక్టోబర్ 20న ఇజంను ప్రేక్షకుల ముందుకు తేవాలని పూరీ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా టీమ్ నుంచి అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు.
ఓ సామాజిక అంశం చుట్టూ నడిచే కథతో తెరకెక్కిందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాను కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఆడియో విడుదలైనా ట్రైలర్ ఇంకా విడుదల కాకపోవడంతో సినిమా ఎలా ఉండబోతోందంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ను విడుదల చేసి, అదే రోజున విడుదల తేదీని కూడా ప్రకటించాలని టీమ్ ప్లాన్ చేస్తోందట. కళ్యాణ్ రామ్ సరసన అదితి ఆర్య హీరోయిన్గా నటించారు.