‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో సూపర్ ఫామ్లో ఉన్న మహేష బాబు హాలీడే తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నారు. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రం కోసం తమన్ సంగీతం అందివ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో తమన్ హవా నడుస్తోంది. ఆయన చేసిన చిత్రాలు భారీ విజయాలుగా నిలుస్తున్నాయి.
ఆయన పనిచేసిన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ భారీ మ్యూజికల్ హిట్ అయింది. సినిమాలోని పాటలన్నీ విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి. ప్రేక్షకులు సైతం తమన్ అందిపుచ్చుకున్న కొత్తదనానికి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే మహేష్, వంశీలు ఆయన్నే తీసుకోవాలనుకుంటున్నారు. ఇకపోతే తమన్, మహేష్ కాంబినేషన్లో గతంలో ‘దూకుడు, బిజినెస్ మాన్, ఆగడు’ లాంటి సినిమాలు రాగా అన్నీ సంగీతం పరంగా మంచి విజయాల్ని సాధించిన సంగతి తెలిసిందే.