రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రౌడీ ఫెలో’

రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘రౌడీ ఫెలో’

Published on Apr 19, 2014 2:03 PM IST

nara-rohit
మూవీమిల్స్ & సినిమా5 పతాకంపై యంగ్ హీరో నారా రోహిత్ కెరియర్ లోనే భారీ మరియు విభిన్నమైన చిత్రం అని చెప్పుకోదగ్గ “రౌడీ ఫెలో” రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ మరియు ఇతర లోకేషన్లలో షూటింగ్ తర్వాత ఇటీవలే 22 రోజుల రాజమండ్రి, కొల్లేరు, భీమవరం పరిసర ప్రాంతాల్లో సుదీర్ఘమైన షెడ్యూల్ ని జరుపుకుంది. పాటలకై చిత్రబృందం ఈ నెలాఖర్లో శ్రీలంకకు బయల్దేరి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. నారా రోహిత్, విశాఖా సింగ్, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న “రౌడీఫెలో” లో ప్రధానపాత్రల్లో రావురమేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, పోసాని, తాళ్ళూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య తదితరులు నటించారు.

స్వామిరారా మరియు ఉయ్యాలా జంపాలాతో వరుస విజయాలను అందుకున్న సన్నీ “రౌడీఫెలో” కి సంగీతం అందించారు. ఆషికీ-2 లో తన గాత్రంతో దేశాన్ని ఉర్రూతలూగించిన యువ గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులో అన్ని పాటలూ పాడడం విశేషం. ఈ చిత్ర నిర్మాత టి. ప్రకాష్ రెడ్డి సోదరుడైన దివంగత సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి స్వరపరిచిన ఒక పాటని జత చేస్తున్నట్టు ఈ సినిమా యూనిట్ తెలిపింది. అనిల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆడియో రిలీజ్ మే 25న జరగనుంది.

ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ, “రౌడీఫెలో” యాక్షన్, కామెడీ, డ్రామా మరియు రొమాన్స్ మిళితమైన ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి వారి మన్ననలను పొందనుందని తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు కృష్ణ చైతన్య విభిన్నమైన కథనం మరియు దర్శకత్వ శైలి ప్రతీ ఫ్రేమ్ లో కనిపిస్తుందని, అదే ఈ చిత్రాన్ని మేటి చిత్రాల సరసన నిలపనుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జూలైలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలకై వేచి చూడండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు