‘మా’ ఎన్నికలు : ఓటేసిన సినీ ప్రముఖులు

‘మా’ ఎన్నికలు : ఓటేసిన సినీ ప్రముఖులు

Published on Mar 29, 2015 12:25 PM IST

Celebs-at-Maa-Elections-
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)‍లోని కీలక పదవులకు 2015-17 దఫాకు గానూ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2గంటల వరకు సాగనుంది. ప్రధానంగా మా అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్, నటి జయసుధలు పోటీలో ఉన్నారు. ఇక సుమారు 750మంది శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండగా, అందులో 708మంది ఓటు హక్కు కలిగిన వారున్నారు.

పోటీలో ఉన్న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకోవడం, సవాళ్ళు విసురుకోవడంతో ఈ ఎన్నిక పట్ల సామాన్య ప్రజానీకంలోనూ ఆసక్తి రేగింది. గత కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలతో సినీ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం 1993లో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఏర్పాటైంది. ప్రస్తుతం ఎంపీ మురళీ మోహన్ ‘మా’కు అధ్యక్షుడిగా ఉన్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఆయన మళ్ళీ ఆ పదవిని చేపట్టే ఆలోచనలో లేరు. ఇక ఈ క్రమంలోనే 2015-17 దఫాకు అధ్యక్ష పదవికి కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి.

ఈ ఉదయం మొదలైన పోలింగ్‍లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటివరకూ బాలకృష్ణ, మంచు విష్ణు, మురళీ మోహన్, సీనియర్ నరేష్, కోటశ్రీనివాస రావుతో పాటు పలువురు నటులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ మధ్యాహ్నమే ముగుస్తున్నా, ఫలితాలు మాత్రం కోర్టు ఆదేశాల నేపథ్యంలో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వెలువడే పరిస్థితి లేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు