యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ను చకచకా ప్లాన్ చేసుకుంటూ, ప్రస్తుతం రెండు వరుస సినిమాలను చేసుకుపోతున్నారు. ఇందులో మొదటిదైన శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మిస్టర్’, ఈమధ్యే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఆ షెడ్యూల్ అయిపోయిన వెంటనే వరుణ్ మరో సినిమా ‘ఫిదా’ ఫస్ట్ షెడ్యూల్ను మొదలుపెట్టేశారు. సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం బాన్సువాడలో షూటింగ్ జరుపుకుంటోంది.
వరుణ్ తేజ్ ఓ ఎన్నారైగా నటిస్తోన్న ఈ ప్రేమకథలో ‘ప్రేమమ్’తో సౌతిండియాలో సంచలనం సృష్టించిన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక రెండు సినిమాలతో పూర్తిగా బిజీగా మారిపోయానని, ప్రస్తుతం వర్క్తో పూర్తిగా ప్రేమలో పడిపోయానని వరుణ్ ఈ సందర్భంగా తెలిపారు. ‘ఫిదా’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్నారు. బాన్సువాడలోనే మరికొద్దిరోజుల పాటు షూటింగ్ జరగనుంది.