ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ చేసుకున్న క్రేజీ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 3’

తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో అలరించడానికి సిద్ధమైంది. మొదటి రెండు సీజన్లు సాలిడ్ వ్యూయర్‌షిప్‌తో సూపర్ హిట్ అవ్వగా, ఈసారి అంతకుమించిన ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ క్రేజీ సిరీస్ రాబోతోంది. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సరికొత్త సీజన్‌కు సంబంధించిన క్రేజీ ట్రైలర్‌ను జీయో హాట్‌స్టార్ విడుదల చేసింది. ఈసారి కథలో సరికొత్త డైమెన్షన్‌ను జోడించారు. ముఖ్యంగా కమెడియన్ వెన్నెల కిషోర్ ‘ఇంద్రుడి’ పాత్రలో ఎంట్రీ ఇచ్చి, ప్రధాన పాత్రధారుల కష్టాలను తీర్చేందుకు రావడం.. ఆపై జరిగే గందరగోళం, నవ్వులు ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఈ సిరీస్ జూన్ 19 నుండి పలు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ సక్సెస్‌ఫుల్ సిరీస్‌కు ‘యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం క్రియేటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీరామ్ యెగరం దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ను శివ మేక, సాహితి చింతలపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూడో సీజన్‌లో జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో సందడి చేయనున్నారు.

Exit mobile version