టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ ర్యాంకులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్లో తమ హీరో ర్యాంక్ను చూసి అభిమానులు మురిసిపోవడం ప్రతిసారీ జరిగేదే! 2011నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందులో స్థానం సంపాదిస్తూ ఉండడంతో ఈ లిస్ట్పై తెలుగు ప్రజల్లోనూ ఆసక్తి కనిపిస్తూ వచ్చింది. ఇక 2013లో మహేష్ బాబు ఏకంగా నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించడంతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్నే తెచ్చుకుంది.
తాజాగా 2015 సంవత్సరానికి గానూ టైమ్స్ పత్రిక మోస్ట్ డిజరైబుల్ మెన్ లిస్ట్ను ఈ ఉదయం ప్రకటించింది. ఇందులో మహేష్ 6వ స్థానంలో ఉన్నారు. గతేడాది కూడా మహేష్ ఇదే స్థానంలో ఉండడం ఆసక్తికర అంశం. ఇక ఇదిలా ఉంటే టాప్ 10లో మహేష్ మినహా వేరొక సౌతిండియన్ స్టార్ లేకపోవడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈసారి మొదటి స్థానాన్ని ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సొంతం చేసుకోగా, ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్స్ ఫవాద్ ఖాన్, హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా టాప్ 5లో ఉన్నారు. ఇక మహేష్ కాకుండా తెలుగు హీరోలు రానా (11), ప్రభాస్ (13), రామ్ చరణ్ (38)లు మాత్రమే టాప్ 50లో చోటు సంపాదించుకున్నారు.