దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో కళ్యాణ్ రామ్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఇజం’ పేరుతో ఓ మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓ సామాజిక అంశం చుట్టూ ముడిపడి ఉన్న కథతో పూరీ జగన్నాథ్ చేస్తోన్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త లుక్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పటికే 80%పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది.
ఇక ఈ షెడ్యూల్లో భాగంగా పూరీ, ఓ భారీ కార్ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం అక్కడి పోలీస్ వ్యవస్థతో మాట్లాడి, ట్రాఫిక్ సంబంధిత పర్మిషన్ తీసుకోవడం కూడా విశేషంగా చెప్పుకోవాలి. మరికొద్దిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ స్వయంగా తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సిక్స్ప్యాక్ లుక్లో కనిపించనుండగా, అందుకు సంబంధించిన స్టిల్స్ సెప్టెంబర్ మొదటి వారంలో విడుదలవుతాయని సమాచారం. సెప్టెంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.