దర్శకుడు రాజమౌళి ఇప్పుడు ఇండియన్ సినిమా టాప్ ఫిల్మ్మేకర్స్లో ఒకరు. ‘బాహుబలి’ అనే సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇండియన్ సినిమాలో ఎవ్వరూ చేయని సాహసం చేసి అందరి మన్ననలూ పొందిన ఆయన, ప్రస్తుతం దానికి ఎన్నోరెట్లు మించేలా రెండో భాగమైన ‘బాహుబలి 2’ కోసం కష్టపడుతున్నారు. ఇక ఇప్పట్నుంచే మొదలైన ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా వర్చువల్ రియాలిటీతో గత రెండు నెలలుగా రాజమౌళి మాయ చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే.
‘బాహుబలి’ సామ్రాజ్యమైన ‘మాహిష్మతి’లో ఉన్నట్లుగా ఫీల్ అయ్యేలా చేసే వర్చువల్ రియాలిటీకి సంబంధించిన టీజర్ ఇప్పటికే ఆన్లైన్లో సంచలనం సృష్టించింది. ఇక ఈ టీజర్ను దేశవ్యాప్తంగా పలు మేజర్ ఈవెంట్స్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఈమధ్యే గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ వీఆర్ టీజర్కు అద్భుతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా ఢిల్లీలో జరుగుతోన్న కామిక్ కాన్ ఈవెంట్లోనూ ఈ టీజర్ సందడి చేస్తోంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీఆర్ ఎక్విప్మెంట్ను అందజేసి అభిమానులకు టీజర్ను ప్రదర్శిస్తున్నారు. రానా సైతం ఈ ఈవెంట్లో పాల్గొని అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘బాహుబలి 2’ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.