మొదటి సినిమా “పెళ్ళిచూపులు”తో నేషనల్ అవార్డ్ అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. పద్మశ్రీ చింతకింది మల్లేశం బయోపిక్ “మల్లేశం” ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఈ యంగ్ డైరెక్టర్ తెలుగు సినిమా పరిశ్రమపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మల్లేశం కథను నిజానికి తాను తెరకెక్కిద్దామనుకున్నాడట. మల్లేశం కథ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తెలుసుకోవాల్సిన కథ అన్నారు.
ఆర్ట్ సినిమానా,కమర్షియల్ సినిమానా? హీరో ఉన్నాడా? కమెడియన్ ఉన్నాడా? అని చూడొద్దు. మన చూసే ట్యాగ్ లైన్ ఫేడ్ అవుట్ అయిపోవాలి. హీరో, కమెడియన్, అనే ట్యాగ్లైన్ పోయి ఎప్పుడైతే యాక్టర్ అనే ట్యాగ్లైన్ వస్తుందో ఆరోజు చాలా ముందుకు వెళతాం అన్నారు.
వేరే భాషలలో మన తాతల్లాంటి సినిమాలు తీస్తున్నారన్న, భాస్కర్ ఇంకా మనం మూసధోరణి లోనే ఉన్నామని అర్థం వచ్చేలా మాట్లాడారు. మంచి సినిమాల ద్వారా భావితరాలకు మనం మంచి విలువల్ని పంచాలన్నారు. సినిమా ఒక వ్యక్తిని కాదు, ఓ సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యానికి నిజ రూపం సినిమా అని చెప్పిన తరుణ్ భాస్కర్, ప్రస్తుత తెలుగు పరిశ్రమలోని పరిస్థితులపై కొంచెం భావోద్వేగ కామెంట్స్ చేశారు.