దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ కలిసి నటిస్తున్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా ‘రణం రౌద్రం రుధిరం’. ఈ సినిమాలో రామ్చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా యొక్క నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘ఆర్ఆర్ఆర్’ యొక్క అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను సుమారు రూ.325 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
ఒక సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవడం ఇదే తొలిసారి. దీంతో సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్
బిజినెస్ మొత్తం దగ్గర దగ్గర రూ.900 కోట్లకు చేరింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద బిజినెస్. ఈ చిత్రంలో తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ రీత్యా ఈ విడుదల సాధ్యమవుతుందో లేదో స్పష్టత లేకుండా ఉంది.