సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ శంకర్ల కాంబినేషన్లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమాకు శంకర్ ‘2.0’ అన్న ఒకే టైటిల్ను తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషలకూ ఫిక్స్ చేశారు. ఇక అదేవిధంగా ‘2.0’ లోగో, ఫస్ట్లుక్లను నవంబర్ 20న చేపట్టనున్నట్లు నెలక్రితమే ప్రకటించిన టీమ్, తాజాగా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేసింది.
బాలీవుడ్లో ప్రఖ్యాత ఫిల్మ్ స్టూడియోల్లో ఒకటైన యాష్ రాజ్ ఫిల్మ్ స్టూడియోలో 2.0 ఫస్ట్లుక్ను విడుదల చేయనున్నారట. నవంబర్ 20న సాయంత్రం ఐదు గంటలకు పెద్ద ఎత్తున నిర్వహించనున్న వేడుకలో ఫస్ట్లుక్, లోగోలను విడుదల చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ముఖ్య అతిథిగా హాజరవుతూ స్వయంగా ఆయనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తోండగా, అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నారు.