కోనసీమ అమ్మాయిగా అస్సాం నటి.. ‘కొత్త మలుపు’ విశేషాలు తెలిపిన భైరవి ఆర్థ్యా

Actress Bhairavi Arthya Interview on Kotha Malupu Movie

సింగర్ సునీత కుమారుడు ఆకాష్, భైరవి ఆర్థ్యా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలను పంచుకున్నారు. అస్సాంకు చెందిన తాను సినిమాలపై ఆసక్తితో తెలుగు నేర్చుకుని ఈ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు ఆమె తెలిపారు.

ఈ చిత్రంలో తాను కోనసీమకు చెందిన ‘వరలక్ష్మి’ అనే పల్లెటూరి యువతి పాత్రలో నటించినట్లు భైరవి చెప్పారు. అస్సాం జీవనశైలికి, కోనసీమ వాతావరణానికి చాలా తేడా ఉండటంతో.. పాత్ర కోసం ముందుగా నెలరోజుల పాటు అక్కడే ఉండి స్థానికుల యాస, కట్టుబాట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. భాష రాకపోయినా అవకాశాల కోసం ఆడిషన్స్ ఇస్తూనే, హైదరాబాద్‌లోని నటరంగ్ థియేటర్‌లో ఆరు నెలల పాటు నటనలో శిక్షణ తీసుకున్నానని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు శివ, హీరో ఆకాష్ సహకారంతో గోదావరి యాసలో డైలాగులు చెప్పడం సులువైందని అన్నారు.

కుటుంబ భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భైరవి ఆశాభావం వ్యక్తం చేశారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని, ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే ఓటీటీ ప్రాజెక్టుల్లో నటించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Exit mobile version