టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అరవింద్ కుటుంబం పెళ్లి పిలుపుల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆచారాల ప్రకారం, ఈ వివాహ వేడుకకు సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను శిరీష్ తన మావయ్య, మెగాస్టార్ చిరంజీవికి అందించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ దంపతులు, చిరంజీవి-సురేఖ దంపతులకు నూతన వస్త్రాలు సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి కాస్తా వైరల్గా మారాయి. అయితే, ఈ ఫోటోలలో చిరంజీవి ఎడమ చేతికి కట్టు ఉండటం చూసి మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు.
అభిమానుల ఆందోళన నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిరంజీవి భుజానికి ఒక చిన్న సర్జరీ జరిగిందని, వైద్యుల సలహా మేరకే ఆయన చేతికి ఆ షోల్డర్ బ్యాగ్ను ధరించారని సమాచారం. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
