చిరంజీవి, రామ్చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆచార్య’ కోసం అనంత్ శ్రీరామ్ ‘నీలాంబరీ నీలాంబరీ వేరెవ్వరే నీలా మరి’ అంటూ రాసిన పాట ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఈ పాట రాయడానికి అనంత్ శ్రీరామ్ చేసిన కసరత్తులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో హీరోయిన్ చలాకీగా కనిపించే అల్లరి అమ్మాయి, అలాగే హీరో ఓ పెద్దాయన దగ్గర పెరిగిన, బిడియంతో ఉండే అబ్బాయి.
మరి ఆ ఇద్దరికీ మధ్య ప్రేమ పుట్టాక, అప్పుడే ఈ పాట వస్తుంది. అమ్మాయి అందాన్ని, తన అల్లరి లక్షణాన్ని చెప్పే క్రమంలో ‘వేరెవ్వరే నీలా మరి… నీ అందమే నీ అల్లరి’ అంటూ హుక్ లైన్ లో రాశా. ఈ పాట సామాజిక వేదికల్లో హల్చల్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈ పాట విడుదల తర్వాత చిరంజీవి సర్ ఫోన్ చేశారు. ‘గొప్ప మెలోడీ ఇచ్చావని మణిశర్మకి ఫోన్ చేశా, అయినా నాకు సంతృప్తిగా అనిపించలేదు. ఈ పాటలో సంగీతంతోపాటు సాహిత్యం పోటీ పడింది. అందుకే నీకు ఫోన్ చేశా అనంత్’ అని చెప్పారు’ అంటూ అనంత్ శ్రీరామ్ చెప్పుకొచ్చాడు.