నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం “అఖండ”. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది. అయితే చిత్ర యూనిట్, బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్న ఇలాంటి సమయంలో ఓ చేదు వార్త అందరిలోనూ విషాదాన్ని నింపింది.
బాలయ్య వీరాభిమాని, ఈస్ట్ గోదావరి జిల్లా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జాస్తి రామకృష్ణ అఖండ సినిమా చూస్తూ హఠాన్మరణం చెందాడు. రాజమండ్రి శ్యామల థియేటర్లో ఆయన అఖండ సినిమా చూస్తూ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో థియేటర్ యాజమాన్యం ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆయన మరణించాడని, సినిమా చూస్తున్న సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో రామకృష్ణ మృతిచెందినట్లు తెలిపారు. దీంతో బాలయ్య అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ విచారం వ్యక్తం చేస్తున్నారు.