నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తెలంగాణలోని సిరిసిల్లలో ప్రారంభమైంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్య చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా కనిపిస్తారని, ఈ రెండు పాత్రల మధ్య వేరియేషన్ ఈ సినిమాకి హైలైట్గా నిలుస్తుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ్, మరో కీలక పాత్రలో వరలక్ష్మీ నటిస్తున్నారు.