నిర్మాత బండ్ల గణేష్ – వైఎస్సార్ సీపీ నేత, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)ల మధ్య గత కొన్ని రోజులుగా ఫైనాన్స్ కి సంబంధించిన డబ్బు విషయంలో వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బండ్ల గణేష్ తన అనుచరులతో కలిసి తనను బెదిరించారని పీవీపీ తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అసలు వీరిద్దరి మధ్య ఈ వివాదానికి కారణం ఫైనాన్స్ గా తీసుకున్న సొమ్ము. గతంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘టెంపర్’ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రానికి పీవీపీ రూ.7 కోట్లు ఫైనాన్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో రావాల్సిన సొమ్మును తిరిగి చెల్లించమని పీవీపీ, గణేష్ ను అడిగినందుకు.. బండ్ల గణేష్ పీవీపీని బెదిరించారట. బండ్ల గణేష్ మనుషులు కొంతమంది బెదిరింపులకు పాల్పడినట్టు పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఐపీసీ సెక్షన్ 448, 506, రెడ్విత్ 34 కింద బండ్ల గణేష్ తో పాటు నలుగురి పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ను బంజారా హిల్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
