విదార్థ్, ధృవిక హీరో హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం “భగత్ సింగ్ నగర్”. ఈ చిత్ర బృందం మల్టీప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ‘భగత్ సింగ్ నగర్’ చిత్రాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్, ఉడత్తు కాశీ విశ్వనాథం, ఉశిరికల చంద్రశేఖర్, కృష్ణామోటార్స్ సుధాకర్, టిఎల్ఎన్ మూర్తి, కాపుగంటి ప్రకాష్, ఆర్ కె జైన్, కార్పొరేటర్ రామకృష్ణ, ఎం కె బి శ్రీనివాస్, కుమ్మరిగంటి శ్రీనివాసరావు, చందు మరియు సినిమా చిత్రయూనిట్ బృందం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ విజయనగరానికి చెందిన ఉడత్తుకాశీ కుమారుడైన రమేష్ నిర్మించిన సినిమాను ఆదరించి సినిమా విజయవంతం అయ్యేలా చూడాలని కోరారు.
డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, కౌశిక్లు మాట్లాడుతూ మంచి కథ, విలువలతో కూడిన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని, విజయనగరం జిల్లాకు చెందిన రమేష్ సినిమాను నిర్మించడం సంతోషంగా ఉందని, ఈ సినిమా విజయవంతమై మరిన్ని సినిమాలు నిర్మించాలని అభిలషించారు.
దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ తెలుగు మరియు తమిళ బాషలలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను ప్రకాష్ రాజ్ విడుదల చేయడంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి చక్కని గుర్తింపు లభించిందని అన్నారు. భగత్ సింగ్ నగర్ నుంచి విడుదల అయిన ‘చరిత చూపని’ అనే లిరికల్ సాంగ్కు 1 మిలియన్ వ్యూస్ సాదించిన సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అతి త్వరలో మిగిలిన పాటలతో పాటు ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అన్నారు.
చిత్ర నిర్మాతలు రమేష్ ఉడత్తు మాట్లాడుతూ దేశం కోసం, స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్ అని ఎక్కడో పుట్టి పెరిగిన బ్రిటీష్ వారు మన దేశంలో అడుగుపెట్టి వారి సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించాలన్న వారి కలను చెదరగొట్టి వారిని, వారి సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్ అని, అలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మాకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
హీరో, హీరోయిన్స్ మాట్లాడుతూ ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.