బాలీవుడ్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘బ్రహ్మాస్త్ర’ ఒకటి. రణ్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది.
ఇందులో రణ్బీర్ కపూర్ ‘శివ’ పాత్రలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 ‘శివ’కి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయ్యింది. చేతిలో మండే త్రిశూలం పట్టుకుని నిలబడ్డ రణ్బీర్ కపూర్ లుక్ పవర్ఫుల్గా అనిపించింది. అంతేకాకుండా ఈ పోస్టర్ ద్వారా సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.