పుష్ప రిలీజ్ తర్వాత ఆ సినిమా పై క్లారిటీ వస్తుంది – బన్నీ వాసు

పుష్ప రిలీజ్ తర్వాత ఆ సినిమా పై క్లారిటీ వస్తుంది – బన్నీ వాసు

Published on Oct 14, 2021 12:09 AM IST


అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహించిన సినిమా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్‌ పతాకం పై బన్నీ వాస్‌, వాసు వర్మ ప్రొడ్యూస్‌ చేశారు. అక్టోబర్‌ 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బన్నీ వాస్‌ మీడియాతో మాట్లాడటం జరిగింది.

అఖిల్‌గారితో ఎటువంటి సినిమా తీస్తే బావుంటుందని ఆలోచిస్తున్నప్పుడు, ఆయన నటించిన లాస్ట్‌ రెండు సినిమాలు భారీ యాక్షన్‌ సినిమాలు కనుక సింపుల్‌ కథతో తీస్తే బావుంటుందని అనిపించింది. అఖిల్‌ రిచ్‌ కిడ్‌ కింద కనిపిస్తారు. ఆయన్ను మధ్య తరగతి కుర్రాడిగా, మన ఇంట్లో కుర్రాడిగా ప్రజెంట్‌ చేయాలనేది మా ఫస్ట్‌ టార్గెట్‌. సినిమాలో చిన్న చిన్న ఫైట్లు ఉంటాయి. భారీ ఫైట్స్‌ ఉండవు. అఖిల్‌కు కథ నచ్చడంతో చేశారు అని తెలిపారు.

ఒక అమ్మాయికి, అబ్బాయికి మధ్య జరిగే ఓ సున్నితమైన కథతో తీసిన సినిమా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌. పెళ్లి చేసుకోబోయే వాళ్లకు, ఆల్రెడీ చేసుకున్న వాళ్లకు ఈ సినిమా చూశాక ఒక క్లారిటీ వస్తుంది. పెళ్లి చేసుకోవడానికి అవసరమైన అర్హతలు ఏమిటి? పెళ్లి చేసుకున్నాక ఉండాల్సిన అర్హతలు ఏమిటి? అనేది సినిమా చెబుతుంది. పెళ్లి తర్వాత భార్యతో ఎలా ఉండాలి? లేదా భర్తతో ఎలా ఉండాలి? చెప్పే తల్లితండ్రులు చాలా తక్కువమంది. మేం ఆ పాయింట్‌ను టచ్‌ చేశాం. పెళ్లికి ముందు మాత్రమే కాదు, పెళ్లి తర్వాత ఎలా ఉండాలనేది పిల్లలకు నేర్పించండి అనేది కథలో మెయిన్‌ పాయింట్‌. ఈ సినిమా చూశాక పెళ్లైన వాళ్లకు చాలా క్లారిటీ వస్తుంది అంటూ అసలు పాయింట్ చెప్పుకొచ్చారు.

భాస్కర్‌ స్ర్కిప్ట్‌ రెడీ చేయడానికి ఎక్కువ టైమ్‌ తీసుకుంటాడు. కానీ, షూటింగ్‌కు తీసుకోడు. చాలా ఫాస్ట్‌గా సినిమా తీస్తాడు. 85 డేస్‌లో షూట్‌ కంప్లీట్‌ చేశాడు. మొత్తంగా చూస్తే, రెండేళ్లు పట్టింది. ఎనిమిది నెలలు కరోనా కూడా మాకు దెబ్బ కొట్టింది. దాని వల్ల ఎక్కువ టైమ్‌ పట్టింది అని అన్నారు.

ఆర్య సినిమాతో భాస్కర్‌, వాసువర్మతో నాకు పరిచయం ఏర్పడింది. వాసు వర్మ మాకన్నా సీనియర్‌. తనతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఓ సినిమా విషయంలో ఏదైనా సందేహం ఉంటే తనకు ఫోన్‌ చేస్తే వస్తాడు, హెల్ప్‌ చేస్తాడు. చాలా స్ర్కిప్ట్స్‌లో నాకు డౌట్‌ ఉంటే తన సజిషన్స్‌ అడుగుతా. స్ర్కిప్ట్‌ మీద తనకు మంచి పట్టుంది. గీత గోవిందం, టాక్సీవాలా సినిమాల తర్వాత మా మైండ్‌ సెట్‌ మార్చుకున్నాం. ఇదివరకు ఓ కథ మీద కూర్చుని సినిమా చేసే వరకూ రెండేళ్లు ప్రాజెక్ట్‌ మీద ఉండేవాడిని. అరవింద్‌గారు మన కంపెనీని స్ర్పెడ్‌ చేయాల్సిన టైమ్‌ వచ్చింది అని చెప్పారు. లాస్ట్‌ టు ఇయర్స్‌లో అల్లు స్టూడియోస్‌కు అంకురార్పణ చేశాం. హిందీ సినిమా ప్రారంభించాం. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్‌లో ఎక్కువ సినిమాలు స్టార్ట్‌ చేశాం. నేను ఒక సినిమా మీద కూర్చోవడం కష్టమని, వాసువర్మ లాంటివాళ్లు ఐదారుగురిని తీసుకున్నాం. కరోనా, థియేటర్‌ ఇష్యూస్‌ పోయాక ఐదారు సినిమాలు అనౌన్స్‌ చేస్తాం అని అన్నారు.

అల్లు అర్జున్‌గారితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా ప్లానింగ్‌లో ఉంది. పుష్ప రిలీజ్‌ తర్వాత ఆ సినిమాపై క్లారిటీ వస్తుంది. ఆయన సినిమాల లైనప్‌ విషయంలో ఇప్పుడేం చెప్పలేం అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు