సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారు తీవ్ర అస్వస్థతకు గురై నిన్న ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీయూలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారు. ఇదే విషయం గురించి మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. ‘‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది.
ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’’ అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చిరు మెసేజ్ చేశారు.