పార్థ గోపాల్, మేఘన జంటగా నటించిన చిత్రం “డైమండ్ డెకాయిట్”. సూర్య జి యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో పార్థ గోపాల్, హీరోయిన్ మేఘన వినూత్నంగా టీజర్ను ఆవిష్కరించారు.
హీరో, నిర్మాత పార్థ గోపాల్ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేశామని, ఇదొక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామా అని తెలిపారు. 2026 ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
కడప జిల్లాలోని 60 లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించామని, నిర్మాణంలో పార్థ గోపాల్ ఎక్కడా రాజీపడలేదని దర్శకుడు సూర్య జి యాదవ్ పేర్కొన్నారు. సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ మాట్లాడుతూ.. ఇటీవల చిన్న చిత్రాలకు లభిస్తున్న ఆదరణే తమ సినిమాకు కూడా దక్కుతుందని, పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్గా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
