గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న నయీం డైరీస్ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాము బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వశిష్ఠ సింహ లీడ్ రోల్ చేశారు. సీఏ వరదరాజు నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి చక్కని స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా నిర్మాత సీఏ వరదరాజు మాట్లాడుతూ, “నయీం కథ వినగానే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాగుంటుందని చేశాం. వశిష్ట సింహ నటన హైలెట్ గా ఉంటుంది. మేము అనుకున్న దానికంటే బాగా యాక్ట్ చేశారు. డిసెంబర్ 10న సినిమాను విడుదల చేస్తాం” అని అన్నారు.
దర్శకుడు దాము మాట్లాడుతూ, “రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నాయి అన్నది ధైర్యంగా ఈ సినిమాలో చెబుతున్నాం. నయీం ఎన్కౌంటర్ అయ్యాక అతని గురించి పూర్తిగా అధ్యాయనం చేశాను. తను అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నేనూ విప్లవకారుడు గా ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్నాను. ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడో చూశాను. అవన్నీ డ్రమటిక్గా సినిమాలో చూపించాను. నయీం పాత్ర పోషించిన వశిష్ఠ సింహ నటన సినిమా కు హైలైట్గా నిలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్కు చక్కని స్పందన వస్తోంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా వర్గాల నుండే కాకుండా సమాజం లో విభిన్న వర్గాల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది” అని అన్నారు.
యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్, జబర్దస్త్ ఫణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సురేష్ భార్గవ్, సంగీతం అరుణ్ ప్రభాకర్, ఎడిటర్ కిషోర్ మద్దాలి, పీఆర్వో జి యస్ కె మీడియా, నిర్మాత సీఏ వరదరాజు, రచన దర్శకత్వం దాము బాలాజీ లుగా వ్యవహరిస్తున్నారు.