‘నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ తర్వాత నేచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘టక్ జగదీష్. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో ముచ్చటించారు.
అయితే టక్ జగదీష్ సరదాగా ఉండే కుర్రాడు అని, అది టైటిల్లోనే తెలియాలని అలా టైటిల్ ఫిక్స్ చేశామని, ఆ టక్ వెనకాల ఓ సిన్సియర్ కారణం కూడా ఉంటుందని అన్నారు. సెన్సార్ వాళ్లకు ఈ సినిమా చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని, ఈ సినిమాపై మా ఫీలింగ్ మారిందని, రేపు సినిమా చూశాక టక్ జగదీష్ను చూసే కోణం మారుతుందని అన్నారు.
నేను చిన్నప్పటి నుంచి మా ఊరి వాతావరణంలో, ఉమ్మడి కుటుంబంలో పెరిగానని, నేను చూసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాలని, ఫ్యామిలీ డ్రామాను తీయాలని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే అనుకున్నానని, ఇన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలు చూసిన తరువాత కూడా నేను చేస్తున్న ఫ్యామిలీ డ్రామా ఎలా ఉంటే బాగుంటుంది.. ఇన్ని సినిమాలు వచ్చాక కూడా ఓ ఫ్యామిలీ డ్రామాను తీసి మెప్పించాలంటే ఏదో కొన్ని కొత్త విషయాలు కూడా ఉండాలని అనుకున్నానని, అందుకే నేను చూసిన ఎమోషన్స్ను ఇందులో చూపించానని అన్నారు.
కథ, కథనం అనేవి వేరుగా ఉండవని, టైటిల్స్లో అలా వేస్తాం కానీ కథ రాసుకునేటప్పుడు రెండూ కలిసే ఉంటాయని, ఇది చాలా బలమైన కథ అని అన్నారు. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు కూడా ఇందులో ఉన్నాయని, కమర్షియల్ సినిమాకు ఉండే గ్రాఫ్ ఉంటూనే చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని అన్నారు. ఈ సినిమాలో నాని ఓ సరదా మనిషి అని, బయటి నుంచి ఏ ప్రాబ్లం అయిన వస్తే ఇరగ్గొడతాడని, అదే ఇంట్లోనే సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది ఈ కథ అని అన్నారు.
ఈ సినిమాలో విజిల్స్ పడే సీన్స్ చాలా ఉన్నాయని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు కూడా థియేటర్లకు రాలేరని, ఒటీటీలో విడుదలవుతుండడం వలన నానమ్మ, అమ్మమ్మలతో కలిసి కుటుంబమంతా కలిసి సినిమా చూస్తారని, ఓటీటీలో రావడంపై నెగెటివ్ కన్నా పాజిటివ్లే తాను చూస్తున్నానని అన్నారు.
నాని గారితో సినిమా చేయాలని అనుకున్నప్పుడు ఆయన ఆఫీస్కు రమ్మన్నారని, పది నిమిషాల్లోనే ఆయనకు కథ చెప్పాను, ఆ చెప్పడమే ఓ ట్విస్ట్తో చెప్పానని, అది బాగా నచ్చడంతో వెంటనే నాని ఓకే చెప్పారని అన్నారు. నేను లవ్ స్టోరీ చెబుతాను అని అనుకుని నాని గారు ముందు అనుకున్నాడని, కానీ చెప్పడమే భూదేవీపురం, భూకక్షలు అని చెప్పడంతో నాని ఎగ్జైట్ అయ్యారని అన్నారు.
ఇది ఓ ఇంటెన్స్ కథ అని, మాస్, ఐటం సాంగులు ఇందులో ఉండవని, ప్రారంభం నుంచి చివరి వరకు కనెక్ట్ అవుతుంటారని అన్నారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మధ్య ఉండే కథలు కొత్తగా ఏం ఉంటాయని, ఆ సంఘర్షణను ఎంత కొత్తగా చూపిస్తామనేది ఇంపార్టెంట్ అని, ఇందులో కథనం అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు.
నేను హైద్రాబాద్కు వచ్చి పద్నాలుగేళ్లు అవుతుందని, ఈ సినిమా చూస్తే మనకు ఇప్పటి జీవితం గుర్తుకు రాదు. మన ఊరు కనిపిస్తుందని, అందరినీ అలా మన ఊర్లోకి తీసుకెళ్తుంది. మన కళ్లు తడుస్తాయి. ఓ మంచి ఫీల్ ఇస్తుందని అన్నారు. నాని టక్ జగదీష్ పాత్ర సరదాగా ఉంటూనే, పవర్, ఎమోషన్స్ ఉంటుందని ఇలా మూడు షేడ్స్ ఉంటాయని, జాతర సీన్ అదిరిపోతుందని అన్నారు.
గోపీ సుందర్ గారితో నేపథ్య సంగీతం చేయిస్తున్నప్పుడు ఓ చిన్న బిట్ సాంగ్ ఉండాలని అనిపించింది. టక్ జగదీష్ పాత్ర గురించి ఇంట్రో సాంగ్ ఉంటే బాగుంటుందని అన్నారు. నేను టీచర్గా పని చేశాను. అదే స్లాంగ్లో పాట పాడి వినిపిస్తే నాని బాగుందని అన్నారని గుర్తు చేసుకున్నారు. నిన్ను కోరి సమయంలోనూ ఇలానే జరిగిందని, నాలుగు పదాలు నాకు తడితే అలా రాసేస్తాను. పూర్తి సాంగ్ నేను రాయలేను అది లిరిక్ రైటర్స్కే వదిలేస్తానని అన్నారు.
దర్శకులందరూ కూడా ఎమోషన్స్ బాగా చూపిస్తారని, శుభ సంకల్పం సినిమా చూసి ఓ ట్రాన్స్లోకి వెళ్లిపోయానని, అందుకే నేను కూడా ఏదైనా తీస్తే అందరూ ఎమోషన్ ఫీల్ అయ్యేలా ఉండాలని అనుకున్నానని, కానీ నాకు కూడా పడి పడి నవ్వుకునే సినిమా తీయాలని ఉంది. కథ ఏది కోరితే ఆ ఎమోషన్ ఇవ్వాల్సిందే అని అన్నారు.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ గారు చేస్తే బాగుంటుందని ఆయనతో చేయించానని, మజిలీ సినిమాకు పాటలు గోపీ సుందర్ చేస్తే బ్యాక్ గ్రౌండ్ తమన్ చేశారని, టక్ జగదీష్కు లైట్ హార్టడ్ మ్యూజిక్ కావాలి.. అలాంటి సీన్లే ఎక్కువున్నాయని అన్నారు. గోపీ గారి మ్యూజిక్ లైట్గా ఉన్నా.. ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందని అందుకే అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఈ కథ మొత్తం జగపతి బాబు, నానిల మధ్యే ఉంటుందని, ఫ్యామిలీ డ్రామా అనే సరికి ఒకరిని పూర్తిగా విలన్ చేయలేం, ఒకరిని మంచోడిని చేయలేం.. ప్రతీ మనిషిలో పాజిటివ్, నెగెటివ్ ఉంటుంది. ఒక్క క్షణం బాగా అనిపిస్తుంది.. ఇంకొసారి సొంత తమ్ముడితోనే గొడవలు పడుతుంటారు. అన్ని పాత్రలకు ఒక వీక్ నెస్ ఉంటుంది. వాటిని జగదీష్ ఎలా హ్యాండిల్ చేశాడన్నది బాగుంటుందని చెప్పుకొచ్చారు.
డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్ జరిగినప్పుడు నేను వైజాగ్లో ఉన్నానని, నాకు అంతగా తెలియదు. నాని గారికి ఫోన్ చేస్తే.. నేను ఇప్పుడే విన్నాను అని అన్నారు. అంతకంటే ఎక్కువ మాట్లాడుకోలేదు. ఆ వివాదానికి మాకు సంబంధం లేదని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు నానిపై అలా కామెంట్లు చేయడంపై సందర్భం వస్తే మాట్లాడుదాం అని అనుకున్నాను. ట్రైలర్ ఈవెంట్లో మీడియా మిత్రుడు అడగడంతో అలా మాట్లాడేశాను. థియేటర్లో సినిమాను చూడటాన్ని నాని ఎంతగా ప్రేమిస్తారో మనందరికీ తెలుసు. అలాంటి నానిని వారు అలా అనడం చూసి కాస్త ఎమోషనల్ అయ్యానని అన్నారు.
నా సినిమాలో హీరోయిన్లకు ఓ ఐడెంటిటీ ఉంటుందని, వచ్చారా? ఆడారా? వెళ్లారా? అనేట్టు ఉండదు. ఇందులో గుమ్మ, చంద్ర అనే పాత్రలకు ఓ ఐడెంటిటీ ఉంటుందని, మీ మనసుల్లోకి ఆ కారెక్టర్లు వెళ్తుంటాయి. ఫ్రెష్ నెస్ కోసం డెనియల్ బాలాజీ గారిని తీసుకున్నాం. తిరువీర్ పాత్ర చాలా బాగుంటుంది. షైన్ స్క్రీన్తో కలిసి ఇప్పటికే ఒక సినిమా చేశానని, కాబట్టి ఎలాంటి ప్రాబ్లం రాలేదని, అందరం కలిసి హ్యాపీగా సినిమా పూర్తిచేశామని అన్నారు.
థియేటర్లకు అనుకుంటే థియేటర్లకే రాయాల్సి ఉంటుంది.. ఓటీటీ కోసం అంటే దానికి తగ్గట్టు రాయాల్సి ఉంటుంది. కానీ థియేటర్ కోసం రాసిన కథను ఓటీటీకి ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ సినిమాను ఓటీటీ తరువాత థియేటర్లో అనేది వారి ఒప్పందం మేరకు ఉంటుంది. ఆ విషయం గురించి నాకు అంతగా తెలియదని అన్నారు.
టక్ జగదీష్ సెటప్లో మళ్లీ కథ రాయను. నేను నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కథ చేయబోతోన్నానని, ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మిస్తారని, కథ ఆల్రెడీ చెప్పేశానని, లైగర్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు మా సినిమా మొదలవుతుందని అన్నారు.