“జైత్ర” సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నా – డైరెక్టర్ వెంకీ కుడుముల‌

“జైత్ర” సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నా – డైరెక్టర్ వెంకీ కుడుముల‌

Published on May 25, 2022 10:53 AM IST

ఎయిమ్స్ మోష‌న్ పిక్చ‌ర్స్‌, ఎస్‌.కె. ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జైత్ర‌. స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తోట మ‌ల్లికార్జున ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రానికి సురేష్ కొండేటి, అల్లం సుభాష్ నిర్మాత‌లు. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ప్ర‌సాద్‌ ల్యాబ్‌లో గురువారం నాడు జ‌రిగింది. ఛలో, భీష్మ చిత్రాల ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల టీజ‌ర్‌, జైత్ర పోస్ట‌ర్‌ ను ఆవిష్క‌రించారు.

అనంత‌రం వెంకీ కుడుముల మాట్లాడుతూ, “నేను ద‌ర్శ‌కులు యోగి, త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర ప‌నిచేశాను. ఈరోజు నా ద‌గ్గ‌ర ప‌నిచేసిన మ‌ల్లి ద‌ర్శ‌కుడిగా మారి ఆయ‌న జైత్ర సినిమా టీజ‌ర్‌కు గెస్ట్‌గా రావ‌డం గౌర‌వంగా భావిస్తున్నాను. మ‌ల్లి నా ద గ్గ‌ర ఛ‌లో సినిమా చేస్తుండ‌గానే నేను చెప్పిన స‌న్నివేశాల‌ను మొహ‌మాటంలేకుండా ఎంతో నిజాయితీగా చెప్పేవాడు. దాంతో ఆయ‌న బాగా క‌నెక్ట్ అయ్యాడు. మ‌ల్లి నువ్వు ఎంత నిజాయితీగా వున్నావో ఈ సినిమా కూడా అంతే నిజాయితీ తీసివుంటావు. ఈ సంద‌ర్భంగా పేరెంట్స్‌కు ఒక‌టి చెప్ప‌ద‌లిచాను. పిల్ల‌లు ఇంజ‌నీర్‌, డాక్ట‌ర్ అవుతానంటే న‌మ్ముతారు. అలాగే ఫిలింమేక‌ర్‌, యాక్ట‌ర్ అవుతానంటే కూడా న‌మ్మండి. ఇంజనీర్, డాక్ట‌ర్ కూడా నాలుగేళ్ళు క‌ష్ట‌ప‌డాలి. సినిమా మేక‌ర్ అవ్వాలంటే కూడా టైం ప‌డుతుంది. ఫిలిం మేకింగ్‌ అనేది బాధ్య‌త‌తో కూడిన జాబ్‌. ఈ చిత్ర నిర్మాత చాలా త‌ప‌న వున్న నిర్మాత‌. మంచి సినిమా తీశాడు. త‌ను క‌రాటే మాస్ట‌ర్ కాబ‌ట్టి అంద‌రూ ఒళ్ళు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌ని చేసుంటార‌ని చ‌మ‌త్క‌రించారు. అలాగే స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ బాగా న‌టించారు. సంగీత ద‌ర్శ‌కుడు చేసిన‌ `జెడెద్దుల` ట్యూన్ నాకు బాగా న‌చ్చింది. ఈ చిత్ర టీమ్‌కు సురేష్‌కొండేటిగారు స‌పోర్ట్ చేయ‌డం ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఇక‌నుంచి జైత్ర యాత్ర సాగాల‌ని కోరుకుంటున్నాను” అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు తోట మ‌ల్లికార్జున మాట్లాడుతూ, “మా నాన్న‌గారు ఊరిలో గుర్తింపు ఇస్తే, సినిమా రంగంలో కేరాఫ్ అడ్రెస్‌ను మా గురువుగారు వెంకీ కుడుముల‌ గారు ఇచ్చారు. నేను క‌థ చెప్పాల‌నుకుంటున్న‌ప్పుడు న‌న్ను న‌మ్ముతారో లేదో అని అనుమానంగా వున్న‌ప్పుడు వెంకీగారే నాకు ధైర్యం ఇచ్చారు. ద‌ర్శ‌కుడు అవ్వ‌డం కంటే మంచి సినిమాకు అసిస్టెంట్ అవ్వ‌డం చాలా క‌ష్టం. ఛ‌లో సినిమాతో నా జ‌ర్నీ మొద‌లైంది. నేను ద‌ర్శ‌కుడిని అవుతానంటే ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. కానీ న‌న్ను న‌మ్మి సుభాష్‌గారు అవ‌కాశం ఇచ్చారు. జైత్ర సినిమా గురించి చెప్పాలంటే, రాయ‌ల‌సీమ‌లో జెడెద్దులు, నాలుగు ఎక‌రాలున్న‌ర భాగ్య‌వంతుడి క‌థ‌. అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఊరు నుంచి వ‌చ్చిన మ‌ట్టి మ‌నిషి క‌థ‌. ఇది అంద‌రికీ న‌చ్చుతుంద‌నే అనుకుంటున్నాను” అని చెప్పారు.

చిత్ర నిర్మాత, ఎస్‌.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, “పాండ‌మిక్ త‌ర్వాత సుభాష్‌ గారితో, ఎస్‌.కె. ఫిలిమ్స్ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. అంత‌కుముందు ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా సినిమాలు మంచి కంటెంట్ వున్న‌వి చేశాను. అలాగే బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇప్పుడు అలా చేసిన సినిమానే జైత్ర‌. జ‌ర్నీ త‌ర్వాత జైత్ర అనేపేరు సెంటిమెంట్‌గా పెట్టాను. ఇందులో రెండుపాట‌లు విన్నారు. ఇంకా నాలుగు పాట‌లున్నాయి. అవి మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటాయి. ఆదిత్య మ్యూజిక్స్ వారు మొద‌టినుంచి ఎంక‌రేజ్ చేస్తున్నారు. వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఇక మ‌ల్లికార్జున తోట‌గారు తూట‌లాంటివారు. ఆయ‌న క‌థ చెప్పిన విధానం చాలా ఇంట్రెస్ట్‌గా వుంది. ఫ‌స్ట్ కాపీ చూశాక బాగా న‌చ్చి మంచి సినిమాగా ఫీల‌య్యాను. మంచి డెడికేష‌న్ వున్న ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఆయ‌న మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఛ‌లో సినిమా త‌ర్వాత వెంకీ కుడుముల‌గారు భీష్మ చేశారు. బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాయి. ఇప్ప‌డు మూడో బ్లాక్ట్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌డానికి మా గురువుగారు మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయ‌బోతున్నారు. అందుకే వెంకీని గెస్ట్‌ గా పిలిచాం. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు బాగా న‌టించారు. తెలుగు ధ‌నుష్‌గా స‌న్నీ వున్నాడు. హీరోయిన్‌ను చూడ‌గానే అనుష్క క‌నిపించింది. ఆమెకు మంచి భ‌విష్య‌త్ వుండాల‌ని కోరుకుంటున్నాను. ఇక ఈ సినిమాకు రీ రికార్డింగ్‌, సంగీతం ఫ‌ణి క‌ళ్యాణ్‌ అద్భుతంగా ఇచ్చారు. జైత్ర సినిమా రంగ‌స్థ‌లం, పుష్ప రేంజ్ సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. గ‌త సినిమాల‌కు ఆద‌రించిన‌ట్లుగా ఈసారి న‌న్ను ఆద‌రిస్తార‌ని అంద‌రికీ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను” అని అన్నారు.

మ‌రో నిర్మాత అల్లం సుభాష్ మాట్లాడుతూ, “మేము క్రాస్‌రోడ్డ్‌లో వున్న‌ప్పుడు ఇండ‌స్ట్రీ వైపు ఎలా వెళ్ళాలో తెలీని త‌రుణంలో మాకు దారిచూపి దిక్యూచిలా నిలిచిన సురేష్ కొండేటి గారి ప్రోత్సాహం మ‌ర్చిపోలేనిది. ఈ సినిమాకు ప‌నిచేసిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్‌ లకు ద‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. 2019 లో మ‌ల్లి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌థ చెప్పారు. ఆయ‌న తోట కాదు తూటాలా అనిపించాడు. కొత్త కాన్సెప్ట్ అద్భుతంగా చెప్పాడు. రాయ‌ల‌సీమ యాస‌తో కూడి మ‌ట్టిమ‌నుషుల క‌థ‌. అంద‌రూ చూసి ఆద‌రించండి” అని తెలిపారు.

సంగీత ద‌ర్శ‌ఖుడు ఫ‌ణి క‌ళ్యాణ్ మాట్లాడుతూ, “నిర్మాత మంచి అభిరుచిగ‌ల నిర్మాత‌. రెండు సంవ‌త్స‌రాల అనుభ‌వం ఈ సినిమా ఇచ్చింది. ఈ సినిమాలో ఫ్యూజ‌న్ సాంగ్ చాలా పాపుల‌ర్ అయింది. ద‌ర్శ‌కుడు విలేజ్ బ్యాక్‌డ్రాప్ క‌థ చెప్ప‌గానే నేను చేయ‌గ‌ల‌నా అని అనుకున్నా. కానీ నాపై న‌మ్మ‌కంతో ఇచ్చాడ‌ని చెప్పాడు. మంచి ఔట్‌పుట్ ఇవ్వ‌గ‌లిగాను. కిట్ట మంచి సాహిత్యం ఇచ్చాడు. న‌టీన‌టులు బాగా న‌టించారు” అని అన్నారు.

హీరోయిన్ రోహిణీ రేచ‌ల్ మాట్లాడుతూ, “షార్ట్ పిలింస్ చేసిన నాకు ఇది తొలి సినిమా. ద‌ర్శ‌క నిర్మాత‌లు చాలా స‌పోర్ట్ చేశారు. సంగీత ద‌ర్శ‌కుడు చ‌క్క‌టి బాణీలు ఇచ్చారు. కిట్టు సాహిత్యం బాగుంది. స‌న్నీ, నేను షార్ట్ ఫిలిం చేశాం. ఈ చిత్రానికి ప‌నిచేసిన అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నా” అని అన్నారు.

హీరో స‌న్నీ న‌వీన్ మాట్లాడుతూ, “ద‌ర్శ‌కుడు తోట‌గారికి వెంకీగారే టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని వుండేది. మీ క‌మిట్‌మెంట్‌కు థ్యాంక్స్‌. రెండు పాట‌లు, టీజ‌ర్ విడుద‌ల‌ చేయడం జరిగింది. నేను ప్రేక్ష‌కుడిగా ఇవి చూసే వెళ‌తాను. మీకూ న‌చ్చితో ప‌దిమందికి చెప్పండి. సోష‌ల్‌ మీడియాలో పోస్ట్ చేయండి. నాకు ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌క‌ముంది. సుభాష్‌గారు లేనిదే సినిమా లేదు. కోవిడ్ నుంచి సినిమా రిలీజ్ వ‌ర‌కు ఆయ‌న జ‌ర్నీ ఎంతోమందికి ఆద‌ర్శంగా వుంది. ఇలాంటి సినిమాను సురేష్‌ కొండేటిగారు రిలీజ్ చేయ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. మా పేరెంట్స్ ది రాయ‌ల‌సీమ‌, నేను మాట్లాడ‌డం ఈజీ అయింది” అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు